Wednesday, December 16, 2009

మన 'సు' దర్శకుడు ఆదుర్తి


ఆత్రేయ మనసు కవి అయితే ఆదుర్తి మనసు దర్శకుడు. ఆయన దర్శించినన్ని ( దర్శకత్వం వహించినన్ని ) మనసుల చిత్రాలు మరే దర్శకుడు చెయ్యలేదేమో ! మానవ సంబంధాలు, మనస్తత్వాలు, ఘర్షణలు చిత్రీకరణలో ఆదుర్తి సుబ్బారావు గారిది విలక్షణ శైలి. ఆయన చిత్రాలు ఈ నాటికీ అజరామరాలు. ఆయన చిత్రాలు గుర్తున్నంతగా ఆయన జీవిత విశేషాలు తెలుగు ప్రేక్షకులకు గుర్తున్నట్లు కనిపించదు. ఆయన 97 వ జన్మదినం సందర్భంగా సమగ్రంగా కాకపోయినా నా సేకరణ లోని కొన్ని ముఖ్యమైన విశేషాలను క్లుప్తంగా అందిస్తున్నాను.

1912 లో డిసెంబర్ 16 వ తేదీన రాజమండ్రిలో జన్మించిన ఆదుర్తి సుబ్బారావు గారి తండ్రి శ్రీ సత్తెన్న పంతులు. ఆయన తాహసిల్దార్ గా పనిచేశారు. సినిమాల మీద ఆసక్తితో తండ్రిని ఎదిరించి 1943 లో బొంబాయి చేరి సినిమాటోగ్రఫీ కోర్స్ లో చేరారు. ఆ సమయంలో తనకు డబ్బు అవసరమొస్తే తండ్రికి రాసే ఉత్తరంలో మనియార్డర్ ఫారంతో బాటు ఓ ప్రామిసరీ నోటు కూడా ఉండేది. " బొంబాయిలో కోర్సుకి అయ్యే ఖర్చుకి తర్వాత కాలంలో నీ తమ్ముళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అగత్యం లేకుండా అప్పుగా తీసుకో " అని సత్తెన్న పంతులు గారి సూచన మేరకే ఆదుర్తి గారు అలా పంపేవారట.

ఆ సమయంలోనే ఆ కోర్సుతో బాటు లాబరేటరీ అసిస్టెంటుగా, ఎడిటింగ్ సహాయకుడిగా కూడా పనిచేశారు. ' వనరాణి ' , ' మంగళ సూత్రం ', ' ఒక రోజు రాజు ', సర్కస్ రాజు ' చిత్రాలకు మాటలు, పాటలు రాసారు. అప్పుడే ఈ రంగాల్లో ఆదుర్తి గారి ప్రతిభను గురించి విన్న ప్రముఖ నాట్యాచార్యుడు ఉదయ శంకర్ నాట్యం ప్రధానాశంగా తాను తీస్తున్న ' కల్పన ' చిత్రానికి సహాయ దర్శకుడిగా తీసుకున్నాడు. ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన బొంబాయి నుండి మద్రాసుకి చేరారు. ఆ సమయంలోనే మచిలీపట్నానికి చెందిన కామేశ్వరీ బాల తో ఆయనకు వివాహం జరిగింది.

తన సోదరుడు ప్రారభించిన ' హారతి ' అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. అది ఎక్కువకాలం నడవలేదు.
( ఆ పత్రికలో ఆయన రాతలు మరోసారి...... )

కె.ఎస్. ప్రకాశరావు గారు నిర్మించిన ' దీక్ష ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రకాశరావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. ' సంక్రాంతి ', ' కన్న తల్లి ' చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ప్రకాశరావు గారి ' బాలానందం ' చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు.

ప్రకాష్ స్టూడియోలో పనిచేసిన డి. బి. నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో వారితో కలిసి సాహిణీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ' అమరసందేశం ' అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. 1954 లో విడుదలైన ఆ చిత్రమే ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో ఆయన చూపించిన ప్రతిభ అన్నపూర్ణ పిక్చర్స్ లో ఆయన ప్రవేశానికి నాంది అయింది. ఆ సంస్థకు తొమ్మిది తెలుగు చిత్రాలు, మూడు తమిళ చిత్రాలు రూపొందించారు.
తమిళ నిర్మాత సి. సుందరం తో కలిసి బాబూ మూవీస్ సంస్థను స్థాపించి ' మంచి మనసులు ', ' మూగమనసులు ', ' తేనెమనసులు ', ' కన్నె మనసులు ' చిత్రాలు నిర్మించారు.

' తేనె మనసులు ' తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రం. అంతే కాదు అందరూ కొత్త నటీనటులతో తీసిన మొదటి చిత్రమని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణకు హీరో గా మొదటి చిత్రం. మొదట ఆరు రీళ్ళు నలుపు తెలుపు లో తీసి నచ్చక మళ్ళీ రంగుల్లో తీసారు. ఆ చిత్రం సంచలనం సృష్టించింది.

ఆయన హిందీ లో ' మిలన్ ' ( మూగమనసులు ), ' డోలీ ' ( తేనెమనసులు ), ' జ్వార్ భలా ' ( దాగుడు మూతలు ), ' మన్ కా మీత్ ' లాంటి సుమారు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. ' దర్పణ్ ', ' జీత్ ' ( పూలరంగడు ) చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఆయన అన్నపూర్ణా సంస్థకు నిర్మించిన ' డా. చక్రవర్తి ' చిత్రానికి నంది బహుమతి వచ్చింది. ఆ బహుమతిగా వచ్చిన నగదు పెట్టుబడిగా అక్కినేని నాగేశ్వర రావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థను స్థాపించి ప్రయోజనాత్మక చిత్రాలు ' సుడి గుండాలు ', ' మరో ప్రపంచం ' నిర్మించారు. అవి ఆర్థికంగా విజయం సాధించాక పోయినా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాలుగా ఆయన చెప్పేవారు.

ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం చేసిన రచయితలు - ముళ్ళపూడి వెంకటరమణ ( దాగుడు మూతలు ), ఎన్. ఆర్. నంది ( కన్నె మనసులు ), డా. కొర్రపాటి గంగాధర రావు ( ఇద్దరు మిత్రులు ), మోదుకూరి జాన్సన్ ( మరో ప్రపంచం ), సత్యానంద్ ( మాయదారి మల్లిగాడు )

ఆయన శిష్యరికంలో ఎదిగిన దర్శకులు - శ్రీయుతులు కె. విశ్వనాథ్, వి. మధుసూదన రావు, టి. కృష్ణ ( ఖైదీ బాబాయ్ ఫేం ), పెండ్యాల నాగాంజనేయులు ( బుల్లెమ్మ ఫేం) , టి. మాధవరావు ( తాళి బొట్టు ఫేం ), ఫై. చంద్ర శేఖర రెడ్డి, ఎం. మల్లిఖార్జున రావు ( గూధచారి 116 ఫేం ), ఎం. నందన కుమార్ ( ఇదేనా న్యాయం ఫేం )

తన ఏకైక పుత్రుడు సాయి భాస్కర్ నిర్మాతగా రవి కళా మందిర్ స్థాపించి ' మాయదారి మల్లిగాడు, ' గాజుల కిష్టయ్య ' చిత్రాలు నిర్మించారు. తర్వాత ' మహాకవి క్షేత్రయ్య ' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురయి గాజుల కిష్టయ్య చిత్రం విడుదల కాకుండానే 1975 అక్టోబరు 1 వ తేదీన స్వర్గస్తులయ్యారు.

ఆయన కుమారుడు సాయి భాస్కర్ తర్వాత ' సిరిమల్లె నవ్వింది ' చిత్రం నిర్మించారు. మరోవిశేషం... భాస్కర్ కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి దగ్గర ' సప్తపది ' చిత్రానికి సహకార దర్శకుడిగా పని చేశారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలగడం నా అదృష్టం.

మనసు
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి జన్మ దిన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....


Vol. No. 01 Pub. No. 140

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం